15, మార్చి 2010, సోమవారం

సూర్యచంద్రులు



విరాటపురం మహారాజు విచిత్రగుప్తుడు ’ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు’ అని హఠం చేసే వ్యక్తి, మూర్ఖశిఖామణి! ఒకరోజు రాత్రి ఆయన ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆకాశంలో వెన్నెల వెండివర్షం కురిపిస్తున్నట్లుంది. చందమామను తదేకంగా చూసిన మహారాజుకు ఎంతో అసూయ కలిగింది. ’ చంద్రుడు తనకంటే ఉన్నతుడి’లా తోచాడు. తక్షణమే సూర్యుడు, నక్షత్రాలు కూడా తన తల పైనే ఉంటారనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తన సింహాసనం కంటే ఎత్తులో వారుండడం అవమానంగా తోచింది ఆయనకు.
మరుసటిరోజు సభలో... మహామంత్రి మాధవవర్మతో, " మహామంత్రీ... ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతులున్నారా?" అని ప్రశ్నించాడు. రాజు మొండితనం, మూర్ఖత్వం తెలిసినవాడు కాబట్టి "ఎవరూ లేరు ప్రభూ.." వినయంగా చెప్పాడు మాధవవర్మ.
" ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు.. నీకు తెలుసా?"
" ఎవరు ప్రభూ ఆ దుర్మార్గులు.. వారికి శిరచ్ఛేదం విధిద్దాం, వారెవరో సెలవివ్వండి" కోపం ప్రదర్శిస్తూ అన్నాడు మాధవవర్మ.
" వారెవరో కాదు మహామంత్రీ.... సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకుంతే వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండు దినాల్లో తేల్చుకునిరండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్ళాడు విచిత్రగుప్తుడు.
సభికులతోపాటు మాధవర్మ, విదూషకుడు కిరీటి తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మాధవవర్మదే అన్నట్లు అంతా ఆయనవైపు తదేకంగా చూశారు.
* *
మరుసటిరోజు సభ ప్రారంభం కాగానే వచ్చాడు మాధవవర్మ. ఆయన వెనకాలే కిరీటి ఉన్నాడు. విచిత్రగుప్తుడికి నమస్కరించి," రాజా... మీ ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు, నక్షత్రాలకు కబురు పంపాము. ’ అల్ప ప్రాణులమైన తమపై దండయాత్ర తగద’ని వేడుకున్నారు. రాబోయే శనివారంనాడు సూర్యుడు, ఆపై ఓ పక్షం రోజుల తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఉద్యానవనంలో మీకు క్షమాపణలు చెబుతామని విన్నవించుకున్నారు. కావున యుద్ధసన్నాహాలు చేయించలేదు." సభికులు మంత్రముగ్ధులై వింటుండగా చెప్పాడు.
వెంటనే కిరీటి అందుకొని," వారి వేడుకోలుకు నేను కూడా సాక్షిని ప్రభూ.... వారు మాట తప్పితే మరుక్షణమే శిక్షించేందుకు యుద్ధానికి సమాయత్తమవుదాం. అప్పటివరకు మీరు శాంతించాలి.." అంటూ విచిత్రగుప్తుడిని చల్లబరిచాడు.
మాధవవర్మ చెప్పిన శనివారం వచ్చింది. ఉద్యానవనంలో సూర్యుడి క్షమాపణకై ఎదురుచూస్తున్న విచిత్రగుప్తుడికి అమితాశ్చర్యం కలిగిస్తూ...... ఆకాశంలో చీకటి కమ్ముకుంది, పక్షులు గూళ్లకు చేరుకోసాగాయి. " సూర్యుడు శరణు కోరేందుకు రాబోతున్నాడు. అయితే తను ప్రాధేయపడడమే మీకు వినబడుతుంది, ఎదురుపడితే మీరు కోపోద్రిక్తులవుతారని తన భయం." మెల్లగా చెప్పాడు మాధవవర్మ.
అతను చెప్పినట్లుగానే," భూపాలా... నన్ను క్షమించు. నీకంటే అల్పుడను, అవసరార్ధం ఆకాశంలో ఉండవలసివచ్చింది. దయచేసి నాపై యుద్ధానికి రాకు." అనే మాటలు వినిపించాయి. విచిత్రగుప్తుడు ఎంతో సంతోషించాడు. కాసేపటికే చీకటి పోయి వెలుతురు వచ్చింది.
అదేవిధంగా పక్షం రోజుల తర్వాత రాత్రి అదే ఉద్యానవనంలో చంద్రుడు, నక్షత్రాలు ఆకాశం నుంచి మాయమై విచిత్రగుప్తుడిని క్షమపణలు కోరారు.
ఈ రెండు సంఘటనల తర్వాత విచిత్రగుప్తుడి కోపమంతా తగ్గిపోయింది. మాధవవర్మ, కిరీటి లను పొగిడాడు. అయితే వారిద్దరు మాత్రం వెంటవెంటనే వచ్చిన సూర్య, చంద్రగ్రహణాలకు ఓ నమస్కారం తెలుపుకోని...... గండం గడిచినందుకు సంతోషించారు. ఆపత్కాలంలో మంచి సలహా ఇచ్చినందుకు మాధవవర్మ కిరీటీని పొగిడితే, కిరీటి మాత్రం ’ఘనతంతా దీనిదే’ అంటూ తన చంకలోని ఖగోళశాస్త్ర పుస్తకాన్ని చూపాడు. దానిలో సూర్యకుటుంబంలోని గ్రహగతులు, సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే తేదీలు వివరంగా ఉన్నాయి. అది చూసిన మాధవవర్మ " నీ హాస్యంతో సభికులను ఆనందింపజేయడమేగాక, విజ్ఞానం పట్ల నీకున్న ఆసక్తితో ఓ పెద్ద విపత్తు నుంచి రక్షించావు." భుజం తట్టి సంతోషంగా చెప్పాడు.
మూర్ఖరాజు ముందు ముందు ఇంకెవరిమీద యుద్ధాలు చేస్తాడో?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి