19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ఇష్టపడి చదవండి:

సంక్రాంతి సెలవులు పూర్తై మీరు మళ్లీ పాఠశాలలకు వెళుతున్నారు. వార్షికపరీక్షలు ఎంతో దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో సమయాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసినా, నిర్లక్ష్యం చేసినా పరీక్షలను సరిగా ఎదుర్కోలేము. సిలబస్ ఎంతో ఉందని, దానిని చూస్తేనే భయకంపితులవుతున్నామని వాపోయే చిన్నారులు ఎంతోమంది. వారు ఒళ్ళంతా భయం నింపుకొని... చదువుతున్నట్లు నటించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భ్రమలో ఉంచుతారు. కానీ, ఏమాత్రం ఏకాగ్రత చూపలేరు. మరికొందరు.. అన్నీ కంఠస్థం పెట్టేసి ఉన్నది ఉన్నట్లు వ్రాసేస్తే వందకు వంద మార్కులు మనవేననుకుని, ఆ దిశలో అన్ని పాఠ్యాంశాలను వల్లె వేస్తుంటారు. ఇంకొందరైతే ఉపాధ్యాయులు చేప్పేటప్పుడే ఏకాగ్రతతో విన్నా కనుక తమకిక ఢోకా లేదని, స్వంతంగా అన్నీ వ్రాస్తామన్న అతివిశ్వాసంతో ఉంటారు. పరీక్షలను ఎడుర్కొనే విషయంలో ఈ మూడు రకాల ధోరణులు పనికిరావు.
పరీక్షల పట్ల కాస్త భయమే ఉండాలి. ఆ కాస్త భయం ఒత్తిడిని కలిగించి మనల్ని అప్రమత్తులుగా ఉంచుతుంది. అలాగే ప్రతి విషయాన్నీ కంఠస్థం పెట్టాలనుకోవడం అశాస్త్రీయం, మూర్ఖత్వం. ఇక ప్రతి దాన్నీ స్వంత మాటల్లో వ్రాస్తామనుకునే విశ్వాసం మనకు మార్కుల్ని సాధించిపెట్టదు. ఎలాంటి పాఠ్యాంశాన్ని ఎలా చదవాలో గమనిద్దాం.
ముందుగా తెలుగు, హిందీ, ఆంగ్లం,.... లాంటి భాషలు చూద్దాం. వీటిల్లోని పద్యాలు, కవితల్లాంటి వాటిని కంఠస్థం చేయాల్సిందే! కారణం వాటిని మన స్వంత మాటల్లో వ్రాయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన విషయం ఏదైనా కంఠతా రావాల్సిందే. అదే నాన్ డీటెయిల్డ్ బుక్ అయితే.... అందులోని స్టోరీని ఒకటికి పదిసార్లు చదివితే కథనంలోని ప్రతి అంశం, ఘట్టం మనకు గుర్తుండిపోతాయి. వీటి పశ్నలకు సమాధానాలంటే కథ వ్రాసినట్టే! ఇక వ్యాకరణం(గ్రామర్) అంటేనే కొరుకుడుపడని అంశంగా భావిస్తాం. కానీ, మీరు పదిమంది జట్టుగా ఏర్పడి ఆయా భాషల్లో వ్యాకరణం ప్రకారం మట్లాడడం అలవర్చుకుంటే సుళువుగా ఒంటబడుతుంది.
గణితం అంట్॑నే భయపడి బడి మానేసేవారు ఎందరో ఉన్నారు. కానీ సుళువుగా మార్కులు తెచ్చిపెట్టే సబ్జక్ట్ గణితం మాత్రమే. అయితే ఇందులో కంఠస్థం అసలు పనికిరాదు. గణితం తార్కిక విద్య. ఒక సమస్యని ఒక రకంగానే సాధించవచ్చని భావించకంది. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. తెలిసిన పరిష్కారలన్నింటినీ సాధన చేయాలి. ఆ పాఠ్యాంశానికి చెందిన సూత్రాలు మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉండాలి. గణిత సమస్య ఏదైనా ఏ సూత్రం ద్వారా పరిష్కరించవచ్చో అంచనాకు రావాలంటే, వీలైనన్ని ఎక్కువ సమస్యల్ని చేయాలి. గణిత అభ్యసనలో భయం పెద్ద అవరోధం. వెంటనే జవాబు రాలేదనే నిరాశను విడిచిపెట్టాలి.
ఫిజికల్ సైన్స్, నాచురల్ సైన్స్ ( జీవ శాస్త్రం) విషయానికొస్తే ఫిజికల్ సైన్స్ గణితంలాగే తార్కికంగా ఉంటుంది. కారణాలను, ఫలితాలను మనం జ్ఞప్తికి ఉంచుకుంటే చాలు, సబ్జక్ట్ మన దగ్గరున్నట్టే! నిర్వచనాలు, రసాయన సమీకరణాలు ఉన్నవి ఉన్నట్లుగా వ్రాయాల్సిఉంటుంది. జీవశాస్త్రంలో వృక్షాలు, జంతువులకు సంబందించిన చిత్రాలు ఎంతో ముఖ్యం. వీటిని చక్కగా వేయడం సాధన చేస్తే చాలు, వాటి అనుబంధ పాఠ్యాంశాలను కూడా సుళువుగా వ్రాయవచ్చు. చూడకుండా చిత్రాలు వేయడం సాధన చేస్తే మెదడును మనమెంతో పదును పెట్టినట్లవుతుంది.
సాంఘికశాస్త్రం విషయానికొస్తే..... అందులోని భూగొళశాస్త్రం సైన్స్ లాగా తార్కిక అంశం. అలాగే అర్ధశాస్త్రం లోని విషయాలు నిత్యం మన కళ్ళెదుట కనిపించేవే!.. ఇందులో కూడా కార్యాకారణ సంబంధమే ఉంటుంది. ఇక చరిత్ర, పౌరశాస్త్రాలు ఎక్కువ సార్లు చదవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో చరిత్ర విషయానికొస్తే .... ఒకే తేదీకి సంబంధించి వివిధ విషయాలు (అవి ఒకదానికొకటి సంబంధం ఉండవు) చదువుతాము. సంబంధం లేని వాటి మధ్య మనమే కృత్రిమ సంబంధం ఊహించుకుంటే చాలు, సుళువుగా గుర్తుండిపోతాయి. ఆ తేదీ నాటి ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోగానే మిగతా సంఘటనలు అప్రయత్నంగా మన ముందుకు వస్తాయి.
ఇలా ప్రతి సబ్జక్టును చదివేందుకు అవసరమైన ప్రణాళికలు ఉపాధ్యాయులు మీకిప్పటికే చెప్పేసి ఉంటారు. విషయమేదైనా ఎంత ఇష్టంగా నేర్చుకుంటే అది అంతే ఇష్టంగా మీదగ్గరుంటుంది.

పరమత సహనం అలవర్చుకోవాలి:

ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో మతవైషమ్యాలు, మతవిద్వేషాలు పెచ్చుమీరడం, మతం పేరుతో హింసాకాండ నిత్యకృత్యమయ్యాయి. మతం పేరుతో జరుగుతున్న ఉగ్రవాదదాడులు, అణచివేతలు మనిషి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ’మతం మత్తుమందు’ అన్నారు మార్క్స్, అది అక్షరాల వాస్తవం. ఆ మతం మత్తులో మనిషి ఆలోచనను, వివేచనను, విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ఇతర మతాల పట్ల పూర్తి ద్వేషభావాన్ని పెంచుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తన మతమే గొప్పదనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
అసలు ఇంతకీ మతమంటే ఏమిటి? దీనికింత శక్తి ఎలా వచ్చిందో పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది.మతం ఒక జీవనవిధానం. మనిషి నైతికవిలువలను, చర్యలను,సామాజిక సంబంధాలను, ప్రకృతి అనుబంధాలను,.... వెరసి విశ్వమానవాళి క్షేమాన్ని, స్నేహాన్ని మతం కోరుతుంది. ఏ మతప్రవక్త ఉద్బోధలను పరిశీలించినా...... మనిషి మానవత్వాన్ని పెంచే నీతిబోధనలు, సక్రమక్రియలు,మనిషి నడవడి.... గురించే ఉంటాయి గాని హింసను ప్రోత్సహించవు. మరి మనుషులెందుకిలా మతం పేరు చెప్పుకుని సాటి మనుషుల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు? మతానికిచ్చిన ప్రాధాన్యం మనుషులకెందుకు ఇవ్వట్లేదు? దీనికి కారణం మతపిచ్చి! నా మతమే గొప్పదనుకునే భావన ముదిరి మనుషుల్లోని జంతులక్షణాలను, మూర్ఖత్వాన్ని పెంచుతుంది.
మత వైషమ్యాల ఫలితంగా జరుగుతున్న దుస్సంఘటనలు ఎందరినో క్షోభ పెడుతున్నాయి. పచ్చనిసంసారాలు మోడుబారుతున్నాయి. మహిళలు, మీలాంటి చిన్నారులు ముఖ్యబాధితులు అవుతున్నారు. మతవిద్వేషాలు సమాజంలో అశాంతిని రేపుతాయి, ప్రజల్లో అభద్రతను కల్పిస్తాయి. నిరంతరం చావుభయం వెంటాడుతుంది. ఈ స్థితిలో ప్రతి చిన్నవిషయం పెద్ద దుర్ఘటనకు మూలమయ్యే అవకాశం ఉంది. ఆడుతూ, పాడుతూ ఆహ్లాదంగా బాల్యాన్ని గడిపే మీపై ఈ ఘటనలు తీవ్ర అలజడిని కలిగించి ఒక మతానికి తీవ్ర మద్దతుదారులుగా, ఆలోచనలేని పిడివాదులుగా తయారుచేస్తున్నాయి. ప్రశాంత సరస్సులా ఉండే సమాజం మతఛాందసం కారణంగా అల్లకల్లోలమవుతుంది.
ఇప్పుడు మనమేం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు.... పరమత సహనం అలవర్చుకోవాలి. వ్యక్తి మతమేదైనా, వేషభాషలు ఎలాంటివైనా అతని మంచితనాన్ని, ప్రేమ, ఆప్యాయతలను గుర్తించాలి. వ్యక్తి ఆకారాన్ని బట్టి ద్వేషించడం మూర్ఖుల లక్షణమవుతుంది. పాఠశాలలోని మీ సహచరుల్లో పలు మతాల వారు ఉండవచ్చు. వారిని ఏనాడూ మత ప్రాతిపదికన గుర్తించవద్దు. అకారణంగా.. ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనలను వారికి ఆపాదించవద్దు. మతం మనం సృష్టించుకున్నదే! మతాలు వ్యాప్తిలోకి రాకముందు మనుషులు సంతోషంగా ఉన్నారనేది వాస్తవం. మతం విషాదం పంచేది కాదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వాలతో, ఆదర్శవంతమైన సమాజాన్ని మనం నిర్మించుకునేందుకే మత సారాన్ని వినియోగించుకోవాలి.

సంపాదనే జీవితలక్ష్యం కారాదు:

ఐదారేళ్ళ క్రిందట మీలాంటి చిన్నారులను ’ పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? ’ అని ప్రశ్నిస్తే ’కలెక్టర్, టీచర్, పోలీస్,...’ ఇలాంటి జవాబులిచ్చేవారు. ప్రస్తుతం మిమ్మల్ని ప్రశ్నిస్తే , నూటికి తొంభైమంది ’ సాఫ్ట్ వేర్ ఇంజినీర్’ అని చెబుతున్నారు. కారణమేమిటా అని తరచి చూస్తే ’అధిక ఆదాయం’ కనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా ’సాఫ్ట్ వేర్’ వృత్తినిపుణులు కావడమే జీవితలక్ష్యంగా ఉండాలని నూరిపోస్తున్నారు.
ఉపాధి ప్రతి ఒక్కరికీ కావాలి, జీవించడానికి అది ప్రాథమిక అవసరం. అయితే డబ్బు సంపాదన కోసమే వృత్తిని ఎన్నుకోవడం భవిష్యత్ లో ఎంతో ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. బహుళజాతి సంస్థల సంస్కృతి ఉద్యోగిని ఒక యంత్రంగా చూస్తుందే గాని, కంపెనీని కుటుంబంలా భావించదు. ఉద్యోగుల పట్ల ఆప్యాయంగా ప్రవర్తించదు. చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగం తీసేసేంత కఠిననిర్ణయాలు తీసుకుంటారు. అలాంతి స్థితి వల్లే పగలు, రాత్రి అన్న బేధం లేకుండా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. క్షణాలను డబ్బుతో పోలుస్తూ ఉంటారు! ’పరిశ్రమల్లో రోజుకు ఎనిమిది గంటల పనికాలం అనే నిబంధన’ బహుళజాతి సంస్థల్లో పూర్తిగా విస్మరించే అంశం.
ఇలాంటి పని విధానాల వల్ల ఉద్యోగులకు లభించే దానికన్నా , వారు కోల్పోయేదే విలువైనది. ఎన్ని గంటలు అదనంగా పనిచేస్తే అంత డబ్బు మన జేబులో చేరుతుంది. అలాంటి స్థితిలో ఎంతోమంది ఆహారం, నిద్ర, సంతృప్తి, సమాజసంబంధాలు, వ్యాయామం,... ఇలాంటి ఆవశ్యక అంశాలను మరచి యంత్రంలా మారుతున్నారు. మనిషి యంత్రమైతే ఎలా? లక్షల రూపాయలు తన కృషితో పోగేయవచ్చు.. ప్రపంచంలో పలుచోట్ల ఆస్తిపాస్తులు కూడబెట్టవచ్చు. మరి మానవసంబంధాలు నెరిపేదెప్పుదు? ’ఎంతో’ సంపాదించాక తీరిగ్గా సంతోషించవచ్చని తొలుత ప్రతి వ్యక్తీ అనుకుంటాడు. కానీ, ధనాన్ని ఆర్జించేటప్పుడు అతనికి వేరే ఆలోచనలేమీ రావు! తను కూడబెట్టిన డబ్బు అసంతృప్తిని మిగిలిస్తూ, మరికొంత కావాలని కోరుతూ ఉంటుంది.
తల్లిదండ్రులు, భార్య, పిల్లలు,... వారితో మనం గడపాల్సిన సమయం అనవసరమైన అంశంగా తోస్తుంది. ఇంటినిండా కొత్తవస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారు ఆభరణాలు,... లాంటి వాటితో కుతుంబసభ్యులు సంతృప్తి చెందుతారని భ్రమిస్తూ ఉంటారు! వాటితో ఇంటిని నింపుతారు. అనుభూతి నిచ్చేవి, కలకాలం గుర్తుండేవి సంతోషకరమైన క్షణాలే గాని...డబ్బు లెక్కలు కాదు!
ఒక్క వృత్తే ప్రపంచాన్ని నడిపించదు. పలు రంగాల్లో ఉద్యోగులు ఉండబట్టే సమాజ మనుగడ సవ్యంగా సాగుతోంది. అలాగే సంపాదించడమొక్కటే ఉద్యోగం యొక్క పరమార్ధం కాదు. సంపాదనతో పాటు సంతృప్తి ఎంతో అవసరం. ధనార్జనలో మునిగి కుటుంబాన్ని, సమాజాన్ని, పరిసరాలను విస్మరించడం వల్ల మనలోని మనిషితత్వం క్రమేపీ మాయమవుతుంది. మరి జీవితలక్ష్యాన్ని మీరు నిర్ధారించుకునేటప్పుడు ఈ అంశాలు జ్ఞప్తికి ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఇతర భాషలు నేర్చుకోవాలి:

మన దేశం భిన్న సంస్కృతుల, భాషల నిలయం. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పుడు దూరప్రయాణాలు స్వల్పమే! కానీ, నేడు ప్రయాణం చాలా సుళువయ్యింది. భారతదేశాన్ని చుట్టి రావడమేగాక, విదేశాలకు కూడా అవలీలగా ప్రయాస లేకుండా వెళ్ళొస్తున్నాము. అలాగే భిన్నప్రదేశాలలో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పరభాషీయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఒక్క భాషను మాత్రమే నేర్చుకుని దానినే వినియోగిస్తామంటే అది మన అమాయకత్వం అవుతుంది. తప్పక ఇతర భాషల్ని నేర్చుకోవాలి.
భాష చదివి నేర్చుకునే కళ కాదు. దానిని నేర్చుకుంటూ వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఆ భాషలో మాట్లాడడం, వ్రాయడం, పునశ్చరణ చేసుకోడం లాంటివి నిరంతరం చేస్తుండాలి. దీనికి భాష నేర్చుకునే వాతావరణం అవసరం. సాధారణంగా ఎలాంటి వ్యాకరణం, పద్ధతులు తెలియకున్నా వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. దీనికి వారి పరిసరాలే కారణం. పలు భాషలు మాట్లాడే వారు ఒకే ప్రాంతంలో కలిసిఉన్నప్పుడు ఒకరి భాషను ఇంకొకరు సుళువుగా నేర్చుకుంటారు. ఇదే భాషలు నేర్చే వాతావరణం! ఐతే ఇది అందరికిసాధ్యం కాదు కదా? మరి భాషావాతావరణం ఎలా?
మనమే అలాంతి స్థితిని కల్పించుకోవాలి. వారంలో ఒకరోజు నేర్చుకునే భాషకు కేటాయించాలి. ఆరోజు తప్పైనా, ఒప్పైనా ఆ భాషలోనే కుటుంబసభ్యులతో,స్నేహితులతో సంభాషించాలి. ఆ భాషలోని పుస్తకాలే చదవాలి, టెలివిజన్ లో అ భాషాకార్యక్రమాలే వీక్షించాలి. మనం చేసే ఈ పనులవల్ల కుటుంబసభ్యుల్లో కూడా ఆసక్తి కలిగి వారూ సహకరిస్తారు. అలాగే కొంతమంది స్నేహితులు కూడా మన బాటలోనే నడిచే వీలుంది. అది మనకెంతో సహాయపడుతుంది. పాఠశాలలో భాషాక్లబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు.
వివిధ సందర్భాలలో జరిగే వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం మన భాషాపటిమ పెరిగేందుకు దోహదపడుతుంది. ఇతర భాషలు మాట్లాడే తొలి సందర్భాలలో ప్రతివారిలోనూ సిగ్గు ఆవహిస్తుంది. మాట్లాడే ప్రతిదీ తప్పనే భావన నోరు పెగలకుండా చేస్తుంది. అది సహజమే! కానీ ఆ స్థితి నుంచి త్వరగా బయటపడాలి. గొప్ప వక్తల ఉపన్యాసాలను గమనించాలి. ఎదురుగా లక్షలమంది శ్రోతలున్నా వారి గొంతు ఏ మాత్రం వణకదు. ’ ఎదురుగా ఎవరూ లేరు ’ అనుకుని ధీమాగా ప్రసంగిస్తారు.
వేగంగా ఆంగ్లంలో, హిందీలో ,.... ఇంకా ఇతర భాషల్లో మాట్లాడేవారిని చూస్తే మనకు అసూయ వేస్తుంది. అయితే ఆ నైపుణ్యం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాదనే వాస్తవాన్ని మనం మరువకూడదు. కృషి చేస్తే పలు భాషల్లో పట్టు సంపాదించడం అసాధ్యమేమీకాదు. బహుభాషాకోవిదులను గురించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి మరి.

వ్యర్ధమైనదేదిలేదు:

’ కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల,..... కాదేదీ కవితకనర్హం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్ష్రరసత్యాలు. కవిత్వానికే కాదు, దేనికీ అనర్హమయినవి, వ్యర్ధమైనవి సృష్టిలో లేవు. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి లోని అర్ధాన్ని, వాటి ఉపయోగాన్ని మనం వినియోగించుకోవాలి. దేన్నైనా మనకంటే స్థాయి తక్కువగానే భావిస్తూఉంటాము. తరుచుగా వాటిని కించపరుస్తూ ఉంటాము. అవి ఉపయోగపడే సందర్భాలను పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
ప్రాణుల సంగతే తీసుకుందాం... మనుషులు తప్ప ఏ ఇతర ప్రాణైనా తెలివి లేనివని, వాటివల్ల ఒనగూరేదేమీలేదనేది మన అభిప్రాయం. కీటకాలు, పక్షులు, జంతువులు ఆహారచక్రంలో భాగాలు. మొక్కలు వీటికి ఆధారాలు. ఇవేవీ లేకుంటే మానవ మనుగడ అసాధ్యం. ఆహారసమస్యతో మనిషి భూమిపై ఎప్పుడో అంతరించి ఉండేవాడు. తెలివితేటల విషయానికొస్తే ...... కొన్ని జంతువుల, పక్షుల జ్ఞానాన్ని మనమిప్పటికీ అందుకోలేదు. భూకంపాలు, అగ్నిపర్వత ప్రేలుళ్ళూ,... లాంటి ప్రకృతి విలయాలను కొన్ని చేపలు, కొన్ని వన్యప్రాణులు ముందే పసిగట్టగలవు, కానీ మనకా శక్తి లేదు. కుక్కలకున్న వాసనగ్రహించే శక్తిలో మనది ఎన్నో వంతు? మన చెవులు గ్రహించలేని ధ్వనులను సైతం అవి అవలీలగా వింటాయి! చీకట్లో సునాయాసంగా సంచరించే గబ్బిలాల శక్తి ఎంత గొప్పది? అణుబాంబుల ధార్మికశక్తిని కూడా తట్టుకోగలిగే బొద్దింక, టెలిస్కోపు లాంటి చూపు కల్గిన డేగ, కొన్ని నెలలపాటు ఆహారము-నీరు తీసుకోకుండా బ్రతికే ఎడారి ప్రాణులు, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించుకుని దీర్ఘనిద్ర లోకి జారుకునే ధ్రువపుప్రాణులు,.... ఇలా వేటి ప్రత్యేకత వాటిదే! చిరుప్రాణి అయిన కుందేలు లో మనం పోటీపడి పరిగెత్తలేము. హమ్మ్ంగ్ బర్డ్ లాగా కదలకుండా గాల్లో నిలబడగలమా? అసలు చేతులు చాచి పక్షిలా ఎగురగలమా? కంటికి కనిపించని సూక్ష్మజీవుల శక్తివల్ల మన జబ్బులపాలవడం తెలిసిందే కదా! ప్రకృతిలోని ఏ ప్రాణైనా కొన్ని విషయాల్లో మనకన్నా గొప్పదనే సంగతి ఒప్పుకుని తీరాలి.
ప్రాణం లేనివికూడా ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడేవే! రాళ్ళు మనకు వ్యర్ధపదార్థాలుగా తోస్తాయి. కానీ భవన, రహదార్ల నిర్మాణాల్లో వాటి పాత్ర ఎంత ముఖ్యమైనదో మనం ఎరుగుదుము. అందుకే ఎవరినీ తేలికగా తీసేయకూడదు. దేనినీ తక్కువ అంచనా వేయరాదు. సృష్టి లోని ప్రతి అంశం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించబడే ఉద్భవించాయని గ్రహించాలి. సజీవులు, నిర్జీవులలో దేనినైనా పరిశీలించి, పరిశోధించినప్పుదు దాని గుణగణాలు తెలుసుకోగలుగుతాము, దాని ఉపయోగం మనకు అవగతమవుతుంది. బలహీనులు, బుద్ధిహీనులు,జఢపదార్దాలు,.... అనుకునే వాటిలో అంతర్గతంగా ఉండే శక్తిని మనం అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

సినిమా వ్యామోహం వద్దు

’ సినిమా ’ సమాజ మర్పుకు, వినోదానికి ఉపకరించే మంచి మాధ్యమం, సాధనం. అయితే సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు తయారయ్యే మనదేశంలో అధికభాగం జుగుప్సాకర వినోదానికి పరిమితమవుతుంటే , అతికొన్ని మాత్రమే కళాత్మక విలువలతో ఉంటున్నాయి. గతంలో సినిమాప్రదర్శనకు ధియేటరే వేదిక. టెలివిజన్, వీడియోప్లేయర్లు వచ్చాక సినిమా చూడడం చాలా సుళువయ్యింది.
సినిమా అనగానే హీరో, హీరోయిన్, విలన్, ఆరుపాటలు, పది ఫైట్లు,.... ఇలా రొటీన్! అశ్లీలసంభాషణలు, అర్ధనగ్ననృత్యాలు చాలాకామన్. ఇలాంటి సినిమాలను చూసి జీవితమంటే ఇంతే కాబోలు, నిజంగా అలా ఉంటేనే సంతోషంగా ఉన్నట్లు అని అందరూ భ్రమిస్తూ ఉంటారు. మీలాంటి చిన్నారులైతే మరికొంత ఊహల్లోకెళ్ళి కలల్లో కూడా సినిమాలను పలువరించడం జరుగుతుంది.
అబ్బాయిలు హీరోలను చూసి వారిలా డ్రస్ కావాలని, వారిలా స్టైల్ గా బైక్ నడపాలని, అమ్మాయిలు హీరోయిన్ లను చూసి వారిలా మేకప్ కావాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో బాల ఆర్టిస్టులు చేసే పనులన్నీ మీరూ చేసి చూడాలనుకుంటున్నారు! సినిమానటులు చూపేదంతా నిజం కాదు. ఫైటింగ్స్ లో అయితే డూప్స్, దెబ్బలు తగలని ఏర్పాఅట్లు,.... ఉంటాయి. వాళ్ళ వాడే సంభాషణలను నిత్యజీవితంలో ఎవరూ వాడరు. ప్రజల్ని ఆకర్షితుల్నిచేసి, కేవలం సినిమాను ఎక్కువకాలం ప్రదర్శించుకోవడానికి.... అలాంటి మాటలు వారి నోట్లోంచి వస్తుంటాయి. పూర్తిగా వ్యాపారం కోసం తయారైన చలనచిత్రాలనుంచి మనం నేర్చుకునేదేమీ ఉండదు, మన విలువైన సమయం వృధా తప్ప!
సమాజగతిని చూపేవి, కొద్దోగొప్పో మనుషుల ఆలోచనల్లో మార్పు కలిగించేవి కళాత్మక చలనచిత్రాలే (ఆర్ట్ సినిమాలు)! దారిద్ర్యాన్ని, దోపిడీని, ఆవేదనను, సగటు మనిషి జీవితాన్ని వీటిల్లో చూపుతారు.
హీరో, హీరోయిన్ల పట్ల ఆరాధనాభావంతో వారిలా ఉండాలని ప్రయత్నించడమేగాక వారితో మాట్లాడాలని ఫోన్లు చేయడం, ఉత్తరాలు వ్రాయడం, అభిమానసంఘాలుగా ఏర్పడడం,..... అమాయకత్వంతో చేసే పనులు. మీలాంటి చిన్నారుల్లో కొంతమంది సినిమాల్లో నటించేందుకు ఇంట్లో చెప్పకుండా పారిపోతుంటారు. అలాంటి ఆలోచనలున్న వారెవరైనా మీ స్నేహితులుగా ఉంటే వారి ఆలోచనను మార్చండి. సినిమా- వాస్తవజీవితం రెండు భిన్నధృవాలని తెలపండి.
సమాజంలో అసమానతలను తొలగించేవారు, పేదలకు-దీనులకు సేవ చేసేవారు నిజమైన హీరోలని గుర్తించాలి. డబ్బును పోగేసుకుని పదో పరకో పంచి దాతలమని గర్వపడేవారు ఒకవైపు, డబ్బుకంటే మనిషికి విలువనిచ్చి మానవ అభివృద్దికి తోడ్పడేవారు మరోవైపు ఉన్నప్పుడు నిజమైన హీరోలెవరో గుర్తించలేకపోతే అది అంధత్వమే అవుతుంది. భ్రమ ఎన్నడూ నిజం కాదు!

గొప్ప ఆలోచనలు చేయాలి.

గొప్పగా ఆలోచించాలి-సామాన్యంగా జీవించాలి:
----------------------------------------------------
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తక్కువగా ఆలోచించి, ఆడంబరంగా జీవించాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. గొప్పగా ఎందుకు ఆలోచించాలి! సామాన్యంగా ఎందుకుండాలి? అనే ప్రశ్న వేసుకుంటే దాని వల్ల కలిగే మంచిఫలితాలు కోకొల్లలు మనకు జవాబులుగా దొరుకుతాయి. ప్రసిద్ధులైన ఎంతోమంది వ్యక్తులు ఆ పద్ధతిని అనుసరించే విజయాలు సాధించారు. తమవెంట నడిచేందుకు మరికొంతమందికి స్ఫూర్తి నిచ్చారు.
సాధారణంగా ’ భవిష్యత్ లో నువ్వేం కావాలనుకుంటున్నావ ’ ని మీలాంటి విద్యార్ధుల్ని ప్రశ్నిస్తే చిరుద్యోగం చేయాలనో, చిన్న వ్యాపారం చేయాలనో చెప్పేవారు అధికం. ఉన్నతస్థానాన్ని కోరుతున్నామని చెప్పేవారు స్వల్పం. మిమ్మల్నే కాదు యుక్తవయస్కులను అడిగినా ఇలాంటి సమాధానాలే వస్తాయి. బహుతక్కువమందే ఉన్నత స్థానాన్ని సాధించడం జరుగుతోంది. దీనికి గల ముఖ్యకారణం మన ఆలోచనావిధానమే! మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం సంతృప్తినిస్తుంది. మన సామర్ధ్యం యొక్క వాస్తవవిలువను గుర్తించము. ప్రముఖులైన వారందరూ వారి శక్తి ని పూర్తిగా వినియోగించుకున్నవారే, దానికంటే ముఖ్యంగా వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. మానసికంగా ఎప్పుడు మనం బలహీనతను చూపుతామో ఇక ఆపనిని సాధించడం కష్టసాధ్యమవుతుంది.
గొప్పగా ఆలోచించలేకపోవడానికి మరోకారణం ఆడంబరమైన జీవనవిధానం. పేదలు-ధనవంతుల మధ్య తీవ్రమవుతున్న అంతరాలవల్ల, ధనవంతుల విలాసవంతమైన జీవితం, ప్రసారమాధ్యమాల పొట్టలోంచి అనుక్షణం పుట్టుకువచ్చే మేడిపండు ప్రకటనలు,..... సామాన్యంగా, సరళమార్గంలో జీవించడాన్ని అవహేళన చేస్తున్నాయి. వ్యక్తి స్వార్ధాన్ని పెంచుతున్నాయి. డబ్బుసంపాదించడం, ఖర్చుపెట్టడం, సంపదను అందరిముందూ గర్వంగా ప్రదర్శించుకోవడం... ఇవే ప్రతివ్యక్తి జీవితలక్ష్యం అవుతోంది. సమాజ ఒత్తిడితో, అవహేళనతో పేదవాడు కూడా విలాసాలను స్వంతం చేసుకోవాలని తపనపడుతున్నాడు. ప్రతిఒక్కరూ విలాసాలను అవసరాలని భ్రమిస్తున్నారు.
జీవితలక్షం ఎపుడూ వ్యక్తిగత అభివృద్ధిపైనే ఉండకూడదు.... సమాజంలో ఉన్న చెడును, అమానుషాలను, అమాయకత్వాన్ని తొలగించే విధంగా ఉండాలి. అది సాధించేందుకు మనం ఎలాంటి పాత్ర పోషించాలి, మన శక్తికి తగిన కార్యాన్ని ఎలా నిర్వర్తించాలనే ఆలోచన ఎప్పుడూ మదిలో మెదులుతుండాలి. ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చి, వారి ఆలోచనల్లో మార్పు... తద్వారా సమాజమార్పు కోసం కృషి చేయాలి. ఉన్నతస్థానానికి వెళ్ళడమంటే అధికంగా డబ్బు పోగేయడం, ఉన్నతపదవిని పొందడం మాత్రమేకాదు, మన వ్యక్తిత్వం ఆదర్శనీయంగా ఉండాలి.
ఇక జీవనవిధానంలో ఆడంబరాలను గమనిస్తే.... ప్రతి విలాసం ఎన్నో వనరులను ఖర్చు చేస్తుంది. ప్రకృతిపై అమితభారాన్ని మోపి దాని నాశనానికి దారి తీస్తుంది. అందువల్లనేఆహారం, దుస్తులు, వాహనాలు,.. ఇలా మనం వినియోగిస్తున్న ప్రతి వనరును పొదుపుగా వాడుకోవడం వల్ల భూమిపై మానవ జీవితకాలం పొడిగించబడుతుంది. మహాత్మాగాంధీ, ఆచార్య వినోబాభావే,పుచ్చలపల్లి సుందరయ్య,మదర్ థెరిసా,.... లాంటి మహానుభావుల ఉన్నత ఆలోచనలను, సామాన్యజీవనాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మీలాంటి చిన్నారులు ఆ లోటును పూరిస్తే సమాజానికి అంతకంటే గొప్ప మేలు వేరేది లేదు.

జబ్బుల పట్ల అవగాహన

జబ్బుల పట్ల అవగాహన:
ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనేది వాస్తవం. అయితే కలుషిత గాలి, నీరు, ఆహారం, పరిసరాలు మనల్ని రోగగ్రస్తులుగా
మారుస్తుంటాయి. ఎన్నో జబ్బుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, సమసిపోయాయనుకున్న వ్యాధులు మళ్ళీ జడలు విప్పడం,
ఎంతోమందిని బలి తీసుకోవడం గమనిస్తున్నాం.జబ్బులు సంక్రమించే విధానాలు, వాటికి అందుబాటులోని చికిత్సాపద్ధతులు,
నివారణాచర్యలు గురించి తెలుసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమేగాక ఇతరులకు కూడ మేలు చేయవచ్చు.
వ్యాధులపై మానవాళి సాధించిన విజయాలు చాలా గొప్పవి. కాని, చిన్న చిన్న జబ్బులపట్ల కూడా అవగాహన లేని
ప్రజలెంతోమంది వాటి విషపుకోరల్లో బలవుతున్నారు. మశూచి,రేబిస్,పోలియో,ధనుర్వాతం,క్షయ,కంఠవాపు,టైఫాయిడ్,హెపటైటిస్,
తట్టు,....లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు టీకాలు(వ్యాక్సిన్స్) కనిపెట్టి వాటిని వాటిని నియంత్రించడం మనం వేసిన గొప్ప ముందడుగు.
కానీ, సూక్ష్మజీవులు తమ శక్తిసామర్ధ్యాలను పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో మన మీద దాడికి సిద్ధమవుతూ ఉన్నాయి.
వైద్యరంగంలో మనము ప్రగతి సాధించినా , సాధించాల్సింది చాలా ఉందనడానికి గుర్తు......ఎయిడ్స్, హెపటైటిస్-సి,క్యాన్సర్స్,బర్డ్
ఫ్లూ, స్వైన్ ఫ్లూ.... లాంటి జబ్బులే !
చాలామంది ఉన్నత విద్యావంతుల్లో కూడా జబ్బులపట్ల సరైన అవగాహన లేకపోవడం విచారకరం. ’ జబ్బు వచ్చాక అంతా
డాక్టరే చూస్తాడు...’ అనే భావన సమాజంలో పెరుగుతోంది. ప్రపంచమంతా కుగ్ర్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో జీవితం వేగవంతం
కావడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోవడం, తీసుకునే ఆహారవిలువను పట్టించుకోకపోవడం...... లాంటి వన్నీ జబ్బులపాలు చేస్తున్నాయి.
అంతేగాక మన జీవనవిధానానికి తగ్గట్టు కొత్త జబ్బులు పుట్టుకువస్తున్నాయి( లైఫ్ స్టైయిల్ డిసీజెస్). గాలి, నీరు,ఆహారం,.. జబ్బులు మోసుకొచ్చే ప్రధాన మాధ్యమాలు. మనిషి స్వార్ధం పెరిగి ప్రకృతివనరుల విచ్చలచిడి వినియోగం వల్ల పుడమి అంతా కలుషితం అవుతోంది. మరి ఈస్థితిలో ఈ మాధ్యమాలు ఎన్నో జబ్బులకు కారకాలవుతున్నాయి.ఇది నిత్యమూ మనం గమనించాల్సిన అంశం.
ప్రకృతి స్వఛ్ఛత మన చేతుల్లోనే ఉంది.
’ చికిత్స కంటే నివారణ ముఖ్యం’ అనేనానుడి అక్షరసత్యం. అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవాలేగాని, వచ్చాక మందులూ,
ఇంజెక్షన్లూ ఉన్నాయి కదా! అనే ధీమా ఉండరాదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్వంతంగా మనం వాడే మందులు కూడా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకు సూక్ష్మక్రిమినాశకాలు(యాంటీబయాటిక్స్) నే తీసుకుంటే ... వాటిని విచక్షణారహితంగా
వాడితే వ్యాధి కలిగించే సూక్ష్మజీవి ఆ మందుకు తట్టుకునే శక్తి ని పొంది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అప్పుడు దానిని
సంహరించాలంటే మరింత శక్తివంతమైన మందు అవసరమవుతుంది. అదెంత క్లిష్టమైన పనో ఆలోచించండి.
చిన్నారులూ....జబ్బులు సంక్రమించే విధానం, జాగ్రత్తలు మీ పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. అంతేకాదు...దినపత్రికలు, టెలివిజన్,...లలో కూడా వాటి సమాచారం లభిస్తుంది. వాటిని శ్రద్ధగా చదివి మరికొంతమందికి తెలియజేస్తారని భావిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం గురుంచి తెలుసుకోవడం ముఖ్యం కదా!

సమయం వృధా చేయొద్దు.

అనుకరణ వద్దు.

అనుకరణ వద్దు: _శాఖమూరి శ్రీనివాస్
___________________________________________________
ఇతరుల్లా ఉండాలని ప్రయత్నించడమే అనుకరణ. గొప్ప వ్యక్తులు జీవితంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలే గాని, వారిలానే... వారి రంగాన్నే ఎన్నుకోవడం సమంజసం కాదు.అది మన శారీరక, మానసిక అనుకూలతలకు సరిపోకపోవచ్చు. వారిచ్చిన స్ఫూర్తిని మనకు ఆసక్తి ఉన్న రంగంలో విజయం సాధించేందుకు ఇంధనంగానే వాడుకోవాలి. ఎక్కువమంది అనుకరించడానికే ప్రయత్నిస్తారు గాని, తమ కంటూ కొత్త శైలిని ఏర్పరచుకోరు.
సమాజంలో తక్కువస్థాయిలో ఉన్నవారు ఎక్కువస్థాయిలోని వారిని, వారు ఆ పై స్థాయి వారిని గుడ్డిగా అనుకరించడం జరుగుతోంది. సృష్టిలోని తెలివైన ప్రాణులేవీ మిగతా వాటిని మూర్ఖంగా అనుసరించవు. పసిపాపలు సైతం పెద్దలను పూర్తిగా అనుసరించరని, పెద్దల చేష్టలను పరిశీలించి తమకు వీలైన విధంగా మార్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. ఒకప్పుడు పిల్లల మనస్సు తెల్లకాగితమన్న శాస్త్రజ్ఞులు... నేడు దానిని అంగీకరించక పుట్టుకతోటే వారిలో కొన్ని సహజసిద్ధగుణాలు ఉంటాయని నిర్ధారించారు. ఆలోచనాస్థాయి తక్కువుండే కొన్ని జంతువులు(గొర్రెలు, గేదెలు, పందులు...లాంటివి) మాత్రమే మిగతావాటిని అనుసరిస్తూ ఉంటాయి. అనుకరణ వల్ల మన ఆలోచనాపరిధి కుచించుకునిపోతుంది. కొద్ది రోజులకు పూర్తిగా ఆలోచనారహితస్థితికి చేరుకుంటాము. ఇతరులపై ఆధారపడడం అధికమవుతుంది. ఫలితం...... స్వతంత్రించి ఏ పని చేయాలన్నా అపరిమితమైన భయం, అభద్రతాభావం వెంటాడుతాయి. సృజనాత్మకత పూర్తిగా తగ్గిపోతుంది.
స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటే విఫలం చెందుతామని భయపడకూడదు. ఇతరులను పరిశీలిస్తూనే.... అందరి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటూనే ధైర్యంగా మనదైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి మన నిర్ణయం వల్ల వైఫల్యం ఎదురుకావచ్చు. అంతమాత్రాన మనం ఓడినట్లు కాదు. వైఫల్యం ఎప్పుడూ విజయానికి ఉన్న రహదారిని స్పష్టంగా చూపుతుంది. అనుకరణ చేసేవాడికి లక్ష్యం పట్ల అవగాహన ఉండదు. ఒకవేల లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా దానిని సాధించేందుకు అవసరమైన శ్రమ, ఏకాగ్రత, సృజనాత్మకత, పట్టుదల,.... లాంటి మానసిక బలాలు ఉండవు. విజయానికి తీసుకెల్లే దారి స్పష్టపడదు.
ఇతరులను అనుకరించి ఉంటే ఎ.ఆర్.రహమాన్ కీబోర్డ్ ప్లేయర్ గానే ఉండేవాడు, సగర్వంగా ఆస్కార్ అవార్డ్ అందుకునే వాడు కాదు. రజనీకాంత్ బస్ కండక్టర్ గానే ఉంటే ఇంతమంది అభిమానులను ఎలా సంపాదించుకునేవాడు? సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగంతో సంతృప్తి పడి, ఇతరుల్లాగా లంచాలు మేస్తూ ఉంటే ఎన్.టి.ఆర్. పేరు ఎంతమందికి తెలిసిఉండేది? ...... ఇలా ఎందరో అనుకరణ అనే పదాన్ని తమ జీవితంలో లేకుండా చేసుక్లున్నారు. ఎంతోమంది తమ జీవితసారాలను అనుకరించేలా కృషి చేసారు.
ప్రతి వ్యక్తికీ తమవైన ప్రత్యేక లక్షణాలు, ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. అందుకే మనల్ని మనం తరచి చూసుకోవాలి. మన బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. ఆసక్తి ఉన్న రంగంలోని గొప్పవారి జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మనకు ఎదురవ్వబోయే సమస్యలేంటో ఊహించగలగాలి. ఇదంతా విజయకాంక్ష ఉన్న వారు చేయాల్సినవి. అనుకరించేవారికి ఇవన్నీ అనవసరం. వారెన్నడూ పరాన్నజీవులుగానే ఉండిపోతారు.
అనుకరణ అంటే స్వంత కాళ్ళున్నా ఊత కర్రలతో నడవడం లాంటింది. చిన్నారులూ..... మీరు ఖచ్చితంగా ఊతకర్రలను విసిరేస్తారని ఆశిస్తాను.

15, ఫిబ్రవరి 2010, సోమవారం

పరీక్షలకు ముందు చదవడమెలా?

పరీక్షలకు ముందు చదవడమెలా?
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి శాఖమూరి Sat, 13 Feb 2010, IST
మీ కోసం...!
పరీక్షల రూపంలో మిమ్మల్ని పరీక్షించే సమయం దగ్గరికొస్తోంది. తొమ్మిదో తరగతి వరకూ పట్టుదలతో ప్రణాళిక ప్రకారం చదవకున్నా హాజరు సాయంతో నెట్టుకొచ్చినవారు పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలనగానే ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక్కోరోజు తరిగిపోతూ, పరీక్షలు దగ్గరపడేకొద్దీ వీరి ఆందోళన మరింత ఎక్కువవుతుంది. ఆందోళన అధికమైతే తెలిసిన ప్రశ్నల జవాబులను కూడా మర్చిపోతామనేది వాస్తవం. 'చదివింది కొంత.. చదవాల్సింది కొండంత' అనే భావనను ముందు మన మనస్సులో నుంచి తీసేయాలి. ఇప్పటికే మీరు స్లిప్‌, యూనిట్‌ టెస్ట్‌, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ ద్వారా ముప్పావువంతు సిలబస్‌ను చదివేశారు. మిగిలిపోయిన కొద్దిపాటి పాఠ్యాంశాలనే చూసుకుని నిరాశ చెందడం వివేకవంతుల లక్షణం కాదు. ఇప్పటివరకు మీరు చదివిన సిలబస్‌ ఎంతో... ముందు గుర్తించండి. దానిని సంపూర్తిగా చదివాకనే మిగిలిన వాటిలో ప్రధానమనుకున్న వాటిని నేర్చుకోవాలి. రోజులో ఎన్ని గంటలు చదవాలో ముందుగా నిర్ధారించుకోవాలి. సబ్జెక్ట్స్‌ అన్నింటికీ ప్రతిరోజూ సమయాన్ని కేటాయించుకోవాలి. ఇక చదివే విధానాన్ని పరిశీలిస్తే అంశాన్ని చదవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అనుసంధానించుకోవడం అనేవి ప్రధానమైనవి. విషయాన్ని ఏకాగ్రతతో చదివాక.. కళ్ళు మూసుకుని అందులోని ముఖ్యమైన, కీలకమైన పదాలు (కీ వర్డ్స్‌) జ్ఞప్తికి తెచ్చుకుని.. వాటిని అంతకుముందే మనకు బాగా తెలిసిన పాఠ్యాంశాలతో జతపరచుకోవాలి. మనం ఏర్పరచుకున్న కీలకమైన పదాలను పట్టికలాగా రాసుకోవాలి.

అదే ప్రశ్నను పునశ్చరణ చేయాలనుకున్నప్పుడు కీలకపదాలను చూసి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. ప్రతిపాఠాన్ని ఈ కీలక పదాల రూపంలో నమోదు చేసుకుంటే పునశ్చరణ తేలికకావడమేగాక, ఎక్కువసార్లు పునశ్చరణ చేయొచ్చు. ఒక ప్రశ్నను కనీసం ఐదుసార్లైనా పునశ్చరించుకున్నప్పుడు అది శాశ్వత జ్ఞాపకశక్తిలోకి వెళ్లిపోతుంది. కొంతమంది వ్యాసరూప ప్రశ్నలు వదిలేసి.. ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలను సాధన చేస్తారు. అయితే ఇవి వ్యాసరూప సమాధానాల్లో అంతర్భాగాలే అని మనం గుర్తించాలి. ఒక పాఠ్యాంశం చదివాక అందులోని స్వల్ప సమాధాన ప్రశ్నలను విడిగా చదవాల్సిన పని ఉండదు. అందుకే పెద్ద ప్రశ్నలు చదివిన వెంటనే బిట్స్‌ను సాధన చేయండి.. ఎంత సులువుగా ఉంటాయో? కొన్ని అంశాలైతే ఎన్నిసార్లు చదివినా మర్చిపోతుంటాము. దీనికి కారణం యాంత్రికంగా చదవడమే! ఆ విషయాన్ని నిత్యజీవిత అంశాలతో మనమే కృత్రిమంగా జతపరచుకుంటే అది మన మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది.

అలాగే మనం వేకువజామున 3 గంటల నుండి 8 గంటల వరకూ ఉన్న సమయం చదువుపట్ల శ్రద్ధ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అయినా మన ప్రమేయం లేకుండా ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా ఉన్నామంటే ఆ సమయం కూడా శ్రద్ధగా చదవడానికి వీలుగా ఉన్నట్లే. సాయంత్రం 6 నుండి 8 గంటల సమయంలో కూడా మనం శ్రద్ధగా చదవొచ్చు.అలాగే ప్రయోగాల విషయానికొస్తే.. ప్రయోగాలు అతి స్వల్పంగా చేసి ఉంటాము. కొందరైతే అసలు చేసి ఉండరు. ప్రయోగ విధానాలు, పరికరాల పేర్లు గుర్తుంచుకోవాలంటే.. ఆ ప్రయోగాన్ని మనం చేసినట్లు ఊహించుకోవాలి. ఈ ఊహలో పరికరాల ఏర్పాటు నుంచి ఫలితం వచ్చేవరకూ క్రమపద్ధతిలో చేసినట్లు, ఫలితం లభించినట్లు ఉండాలి. పరీక్షల్లో ఈ క్రమపద్ధతినే ఉన్నది ఉన్నట్లుగా రాస్తే చాలు.
అన్ని పుస్తకాలూ ఒకేసారి ముందుంచుకుని చదవడం అశాస్త్రీయం. చదివే పుస్తకం తప్ప వేరేవేవీ మన దగ్గర ఉండొద్దు. ఒకరోజు నిర్దేశించుకున్న ప్రణాళిక పూర్తిచేయాలని గట్టి నిర్ణయం తీసుకుని ఏమాత్రం వాయిదా వేయకుండా చదివితే మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రశ్నల్లో చాయిస్‌ ఉంటుందన్న విషయాన్ని కూడా మరవకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోండి.

13, ఫిబ్రవరి 2010, శనివారం

సాక్షిలో చందమామ కథ


నా మొదటి ఉత్తరం

విశ్వ మానవులందరికీ నమస్కారాలు. బాలసాహిత్యంలో నాకృషిని బ్లాగ్ ప్రతిబింబిస్తుంది.