27, జూన్ 2010, ఆదివారం

ప్రణాళిక-క్రమశిక్షణ



మనం నిర్దేశించుకున్న పనిని వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం సరైన పద్ధతే... కానీ, దానివల్ల విజయవంతంగా అ పనిని పూర్తిచేయలేకపోవచ్చు. కాస్త ఆలస్యమైనా చక్కటి ప్రణాళిక వేసుకుని , క్రమశిక్షణతో చేసినప్ప్పుడు పని ఎంత క్లిష్టమైనా సునాయాసంగా పూర్తవుతుందనేది వాస్తవం.
ఓ ప్రముఖుడి జీవితంలోని కొన్నిఘట్టాలను పరిశీలిద్దాం. ఆయన ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్ధులకు మిఠాయిలు కొనిపెట్టమని ఉపాధ్యాయునికి డబ్బునిచ్చాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు, " విద్యార్ధులకు మీ విలువైన సందేశమివ్వండి." అని విజ్ఞప్తి చేశాడు. అప్పటికి ఏవో నాలుగు మాటలు చెప్పినా ఆ ప్రముఖుడికి సంతృప్తి కలుగలేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రసంగించాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత మళ్ళీ అదే పాఠశాలకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ప్రసంగించి వెళ్ళాడు. అప్పుడు ఆయన చక్కటి ప్రణాళికతో ప్రసంగానికి సిద్ధమై వచ్చాడు మరి!
1947 లో ఈయన అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చింది. విడిదిగృహంలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి స్నానం ఆచరించి, చక్కటి వస్త్రధారణతో ఆ రోజు చెప్పబోయే ప్రసంగాన్ని చదువుకోసాగాడు. అదే విడిదిలో ఉన్న ఇతర ప్రముఖులు ఆయన క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన ఆచరణను గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు.
చక్కటి ప్రణాళిక వేసి క్రమశిక్షణతో పూర్తిచేయడం కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు. అసాధ్యం అనుకున్న ఎన్నో నిర్మాణాలను అవలీలగా పూర్తి చేయించిన ఘనుడాయన. కృష్ణరాజసాగర్ ఆనకట్ట, గంధపుతైలం-గంధపుసబ్బు పరిశ్రమలు, భద్రావతి ఇనుము-ఉక్కు పరిశ్రమ, మైసూర్ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్,... లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఆద్యుడాయనే! కర్ణాటక రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి కారణం ఆ ప్రముఖుడి ప్రణాళికాబద్దమైన కృషే. తన 102 సంవత్సరాల వయస్సులో ఏనాడుకూడా క్రమశిక్షణ తప్పని ఉత్తమవ్యక్తి, మహామనిషి. ఆయనెవరో కాదు... అందరూ గౌరవంగా ’సర్ ఎం.వి.’ అని పిలుచుకునే ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
ఇంతకీ ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయలేమా? చేయొచ్చు... కానీ, అది మార్గం తెలియని ప్రయాణం లాంటిది. గమ్యానికి ఎంతో ఆలస్యంగా చేరుతాము. ఒక సాధారణ ఇంజినీర్ 60 సంవత్సరాలలో చేయించగలిగిన పనిని ’సర్ ఎం.వి.’ 6 సంవత్సరాలలోనే సాధించాడు. దీనికి కారణం చక్కటి ప్రణాళికను అనుసరించడమే! ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు పరిచేందుకు అవసరమైన అంశం... క్రమశిక్షణతో పనిని నిర్వర్తించడం. క్రమశిక్షణ మనలోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీస్తుంది. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేయించి మానసికఒత్తిడి లేకుండా చేస్తుంది. ఫలితంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు చక్కటి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ’సర్. ఎం.వి.’ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉండేవారు.
మరి మీలో ఎంత క్రమశిక్షణ ఉంది? ఒక్క అంశానికైనా ప్రణాళికను తయారు చేసుకుంటున్నారా? పాఠశాలలో బోధింపబడ్డ అంశాలు ఏరోజుకారోజు చదవడం ఉత్తమమైన ప్రణాళిక. మరి మీరు దాన్ని ఆచరిస్తున్నారా? పరీక్షల ముందు మాత్రమే చదివితే ఒత్తిడి తప్ప ఫలితముండదు. ప్రణాళిక ప్రకారం చదివేవ్యక్తులు పాఠ్యాంశాలను అవలీలగా పూర్తిచేయడమేగాక, ఆసక్తి ఉన్న ఇతర అంశాలలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎలాంటి ప్రణాళిక లేని వ్యక్తి క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి, స్నేహితులతో వ్యర్ధప్రసంగాలకు,.. సమయాన్ని వృధా చేసుకుని పరీక్షలొచ్చాక చింతిస్తాడు.
కేవలం పాఠ్యాంశాలకే కాదు, దైనందిన కార్యక్రమాలను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తూ క్రమశిక్షణను అందిపుచ్చుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పు తెచ్చి మిమ్ములను గొప్పవారిని చేస్తుంది.

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.
వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.... ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుంద’ ని దండోరా వేయించాడు.
మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.
" ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.
" ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.
" ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.
" రాజా.. మీ బహుమతిని స్వీకరించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."
" ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.
" పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.
" మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.
" శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజులనుంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కారమవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.
విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలేగాని, ఉపశమనచర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.

13, జూన్ 2010, ఆదివారం

ఇంగితజ్ఞానం