19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

జబ్బుల పట్ల అవగాహన

జబ్బుల పట్ల అవగాహన:
ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనేది వాస్తవం. అయితే కలుషిత గాలి, నీరు, ఆహారం, పరిసరాలు మనల్ని రోగగ్రస్తులుగా
మారుస్తుంటాయి. ఎన్నో జబ్బుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, సమసిపోయాయనుకున్న వ్యాధులు మళ్ళీ జడలు విప్పడం,
ఎంతోమందిని బలి తీసుకోవడం గమనిస్తున్నాం.జబ్బులు సంక్రమించే విధానాలు, వాటికి అందుబాటులోని చికిత్సాపద్ధతులు,
నివారణాచర్యలు గురించి తెలుసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమేగాక ఇతరులకు కూడ మేలు చేయవచ్చు.
వ్యాధులపై మానవాళి సాధించిన విజయాలు చాలా గొప్పవి. కాని, చిన్న చిన్న జబ్బులపట్ల కూడా అవగాహన లేని
ప్రజలెంతోమంది వాటి విషపుకోరల్లో బలవుతున్నారు. మశూచి,రేబిస్,పోలియో,ధనుర్వాతం,క్షయ,కంఠవాపు,టైఫాయిడ్,హెపటైటిస్,
తట్టు,....లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు టీకాలు(వ్యాక్సిన్స్) కనిపెట్టి వాటిని వాటిని నియంత్రించడం మనం వేసిన గొప్ప ముందడుగు.
కానీ, సూక్ష్మజీవులు తమ శక్తిసామర్ధ్యాలను పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో మన మీద దాడికి సిద్ధమవుతూ ఉన్నాయి.
వైద్యరంగంలో మనము ప్రగతి సాధించినా , సాధించాల్సింది చాలా ఉందనడానికి గుర్తు......ఎయిడ్స్, హెపటైటిస్-సి,క్యాన్సర్స్,బర్డ్
ఫ్లూ, స్వైన్ ఫ్లూ.... లాంటి జబ్బులే !
చాలామంది ఉన్నత విద్యావంతుల్లో కూడా జబ్బులపట్ల సరైన అవగాహన లేకపోవడం విచారకరం. ’ జబ్బు వచ్చాక అంతా
డాక్టరే చూస్తాడు...’ అనే భావన సమాజంలో పెరుగుతోంది. ప్రపంచమంతా కుగ్ర్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో జీవితం వేగవంతం
కావడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోవడం, తీసుకునే ఆహారవిలువను పట్టించుకోకపోవడం...... లాంటి వన్నీ జబ్బులపాలు చేస్తున్నాయి.
అంతేగాక మన జీవనవిధానానికి తగ్గట్టు కొత్త జబ్బులు పుట్టుకువస్తున్నాయి( లైఫ్ స్టైయిల్ డిసీజెస్). గాలి, నీరు,ఆహారం,.. జబ్బులు మోసుకొచ్చే ప్రధాన మాధ్యమాలు. మనిషి స్వార్ధం పెరిగి ప్రకృతివనరుల విచ్చలచిడి వినియోగం వల్ల పుడమి అంతా కలుషితం అవుతోంది. మరి ఈస్థితిలో ఈ మాధ్యమాలు ఎన్నో జబ్బులకు కారకాలవుతున్నాయి.ఇది నిత్యమూ మనం గమనించాల్సిన అంశం.
ప్రకృతి స్వఛ్ఛత మన చేతుల్లోనే ఉంది.
’ చికిత్స కంటే నివారణ ముఖ్యం’ అనేనానుడి అక్షరసత్యం. అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవాలేగాని, వచ్చాక మందులూ,
ఇంజెక్షన్లూ ఉన్నాయి కదా! అనే ధీమా ఉండరాదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్వంతంగా మనం వాడే మందులు కూడా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకు సూక్ష్మక్రిమినాశకాలు(యాంటీబయాటిక్స్) నే తీసుకుంటే ... వాటిని విచక్షణారహితంగా
వాడితే వ్యాధి కలిగించే సూక్ష్మజీవి ఆ మందుకు తట్టుకునే శక్తి ని పొంది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అప్పుడు దానిని
సంహరించాలంటే మరింత శక్తివంతమైన మందు అవసరమవుతుంది. అదెంత క్లిష్టమైన పనో ఆలోచించండి.
చిన్నారులూ....జబ్బులు సంక్రమించే విధానం, జాగ్రత్తలు మీ పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. అంతేకాదు...దినపత్రికలు, టెలివిజన్,...లలో కూడా వాటి సమాచారం లభిస్తుంది. వాటిని శ్రద్ధగా చదివి మరికొంతమందికి తెలియజేస్తారని భావిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం గురుంచి తెలుసుకోవడం ముఖ్యం కదా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి