19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

గొప్ప ఆలోచనలు చేయాలి.

గొప్పగా ఆలోచించాలి-సామాన్యంగా జీవించాలి:
----------------------------------------------------
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తక్కువగా ఆలోచించి, ఆడంబరంగా జీవించాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. గొప్పగా ఎందుకు ఆలోచించాలి! సామాన్యంగా ఎందుకుండాలి? అనే ప్రశ్న వేసుకుంటే దాని వల్ల కలిగే మంచిఫలితాలు కోకొల్లలు మనకు జవాబులుగా దొరుకుతాయి. ప్రసిద్ధులైన ఎంతోమంది వ్యక్తులు ఆ పద్ధతిని అనుసరించే విజయాలు సాధించారు. తమవెంట నడిచేందుకు మరికొంతమందికి స్ఫూర్తి నిచ్చారు.
సాధారణంగా ’ భవిష్యత్ లో నువ్వేం కావాలనుకుంటున్నావ ’ ని మీలాంటి విద్యార్ధుల్ని ప్రశ్నిస్తే చిరుద్యోగం చేయాలనో, చిన్న వ్యాపారం చేయాలనో చెప్పేవారు అధికం. ఉన్నతస్థానాన్ని కోరుతున్నామని చెప్పేవారు స్వల్పం. మిమ్మల్నే కాదు యుక్తవయస్కులను అడిగినా ఇలాంటి సమాధానాలే వస్తాయి. బహుతక్కువమందే ఉన్నత స్థానాన్ని సాధించడం జరుగుతోంది. దీనికి గల ముఖ్యకారణం మన ఆలోచనావిధానమే! మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం సంతృప్తినిస్తుంది. మన సామర్ధ్యం యొక్క వాస్తవవిలువను గుర్తించము. ప్రముఖులైన వారందరూ వారి శక్తి ని పూర్తిగా వినియోగించుకున్నవారే, దానికంటే ముఖ్యంగా వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. మానసికంగా ఎప్పుడు మనం బలహీనతను చూపుతామో ఇక ఆపనిని సాధించడం కష్టసాధ్యమవుతుంది.
గొప్పగా ఆలోచించలేకపోవడానికి మరోకారణం ఆడంబరమైన జీవనవిధానం. పేదలు-ధనవంతుల మధ్య తీవ్రమవుతున్న అంతరాలవల్ల, ధనవంతుల విలాసవంతమైన జీవితం, ప్రసారమాధ్యమాల పొట్టలోంచి అనుక్షణం పుట్టుకువచ్చే మేడిపండు ప్రకటనలు,..... సామాన్యంగా, సరళమార్గంలో జీవించడాన్ని అవహేళన చేస్తున్నాయి. వ్యక్తి స్వార్ధాన్ని పెంచుతున్నాయి. డబ్బుసంపాదించడం, ఖర్చుపెట్టడం, సంపదను అందరిముందూ గర్వంగా ప్రదర్శించుకోవడం... ఇవే ప్రతివ్యక్తి జీవితలక్ష్యం అవుతోంది. సమాజ ఒత్తిడితో, అవహేళనతో పేదవాడు కూడా విలాసాలను స్వంతం చేసుకోవాలని తపనపడుతున్నాడు. ప్రతిఒక్కరూ విలాసాలను అవసరాలని భ్రమిస్తున్నారు.
జీవితలక్షం ఎపుడూ వ్యక్తిగత అభివృద్ధిపైనే ఉండకూడదు.... సమాజంలో ఉన్న చెడును, అమానుషాలను, అమాయకత్వాన్ని తొలగించే విధంగా ఉండాలి. అది సాధించేందుకు మనం ఎలాంటి పాత్ర పోషించాలి, మన శక్తికి తగిన కార్యాన్ని ఎలా నిర్వర్తించాలనే ఆలోచన ఎప్పుడూ మదిలో మెదులుతుండాలి. ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చి, వారి ఆలోచనల్లో మార్పు... తద్వారా సమాజమార్పు కోసం కృషి చేయాలి. ఉన్నతస్థానానికి వెళ్ళడమంటే అధికంగా డబ్బు పోగేయడం, ఉన్నతపదవిని పొందడం మాత్రమేకాదు, మన వ్యక్తిత్వం ఆదర్శనీయంగా ఉండాలి.
ఇక జీవనవిధానంలో ఆడంబరాలను గమనిస్తే.... ప్రతి విలాసం ఎన్నో వనరులను ఖర్చు చేస్తుంది. ప్రకృతిపై అమితభారాన్ని మోపి దాని నాశనానికి దారి తీస్తుంది. అందువల్లనేఆహారం, దుస్తులు, వాహనాలు,.. ఇలా మనం వినియోగిస్తున్న ప్రతి వనరును పొదుపుగా వాడుకోవడం వల్ల భూమిపై మానవ జీవితకాలం పొడిగించబడుతుంది. మహాత్మాగాంధీ, ఆచార్య వినోబాభావే,పుచ్చలపల్లి సుందరయ్య,మదర్ థెరిసా,.... లాంటి మహానుభావుల ఉన్నత ఆలోచనలను, సామాన్యజీవనాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మీలాంటి చిన్నారులు ఆ లోటును పూరిస్తే సమాజానికి అంతకంటే గొప్ప మేలు వేరేది లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి