19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

సంపాదనే జీవితలక్ష్యం కారాదు:

ఐదారేళ్ళ క్రిందట మీలాంటి చిన్నారులను ’ పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? ’ అని ప్రశ్నిస్తే ’కలెక్టర్, టీచర్, పోలీస్,...’ ఇలాంటి జవాబులిచ్చేవారు. ప్రస్తుతం మిమ్మల్ని ప్రశ్నిస్తే , నూటికి తొంభైమంది ’ సాఫ్ట్ వేర్ ఇంజినీర్’ అని చెబుతున్నారు. కారణమేమిటా అని తరచి చూస్తే ’అధిక ఆదాయం’ కనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా ’సాఫ్ట్ వేర్’ వృత్తినిపుణులు కావడమే జీవితలక్ష్యంగా ఉండాలని నూరిపోస్తున్నారు.
ఉపాధి ప్రతి ఒక్కరికీ కావాలి, జీవించడానికి అది ప్రాథమిక అవసరం. అయితే డబ్బు సంపాదన కోసమే వృత్తిని ఎన్నుకోవడం భవిష్యత్ లో ఎంతో ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. బహుళజాతి సంస్థల సంస్కృతి ఉద్యోగిని ఒక యంత్రంగా చూస్తుందే గాని, కంపెనీని కుటుంబంలా భావించదు. ఉద్యోగుల పట్ల ఆప్యాయంగా ప్రవర్తించదు. చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగం తీసేసేంత కఠిననిర్ణయాలు తీసుకుంటారు. అలాంతి స్థితి వల్లే పగలు, రాత్రి అన్న బేధం లేకుండా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. క్షణాలను డబ్బుతో పోలుస్తూ ఉంటారు! ’పరిశ్రమల్లో రోజుకు ఎనిమిది గంటల పనికాలం అనే నిబంధన’ బహుళజాతి సంస్థల్లో పూర్తిగా విస్మరించే అంశం.
ఇలాంటి పని విధానాల వల్ల ఉద్యోగులకు లభించే దానికన్నా , వారు కోల్పోయేదే విలువైనది. ఎన్ని గంటలు అదనంగా పనిచేస్తే అంత డబ్బు మన జేబులో చేరుతుంది. అలాంటి స్థితిలో ఎంతోమంది ఆహారం, నిద్ర, సంతృప్తి, సమాజసంబంధాలు, వ్యాయామం,... ఇలాంటి ఆవశ్యక అంశాలను మరచి యంత్రంలా మారుతున్నారు. మనిషి యంత్రమైతే ఎలా? లక్షల రూపాయలు తన కృషితో పోగేయవచ్చు.. ప్రపంచంలో పలుచోట్ల ఆస్తిపాస్తులు కూడబెట్టవచ్చు. మరి మానవసంబంధాలు నెరిపేదెప్పుదు? ’ఎంతో’ సంపాదించాక తీరిగ్గా సంతోషించవచ్చని తొలుత ప్రతి వ్యక్తీ అనుకుంటాడు. కానీ, ధనాన్ని ఆర్జించేటప్పుడు అతనికి వేరే ఆలోచనలేమీ రావు! తను కూడబెట్టిన డబ్బు అసంతృప్తిని మిగిలిస్తూ, మరికొంత కావాలని కోరుతూ ఉంటుంది.
తల్లిదండ్రులు, భార్య, పిల్లలు,... వారితో మనం గడపాల్సిన సమయం అనవసరమైన అంశంగా తోస్తుంది. ఇంటినిండా కొత్తవస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారు ఆభరణాలు,... లాంటి వాటితో కుతుంబసభ్యులు సంతృప్తి చెందుతారని భ్రమిస్తూ ఉంటారు! వాటితో ఇంటిని నింపుతారు. అనుభూతి నిచ్చేవి, కలకాలం గుర్తుండేవి సంతోషకరమైన క్షణాలే గాని...డబ్బు లెక్కలు కాదు!
ఒక్క వృత్తే ప్రపంచాన్ని నడిపించదు. పలు రంగాల్లో ఉద్యోగులు ఉండబట్టే సమాజ మనుగడ సవ్యంగా సాగుతోంది. అలాగే సంపాదించడమొక్కటే ఉద్యోగం యొక్క పరమార్ధం కాదు. సంపాదనతో పాటు సంతృప్తి ఎంతో అవసరం. ధనార్జనలో మునిగి కుటుంబాన్ని, సమాజాన్ని, పరిసరాలను విస్మరించడం వల్ల మనలోని మనిషితత్వం క్రమేపీ మాయమవుతుంది. మరి జీవితలక్ష్యాన్ని మీరు నిర్ధారించుకునేటప్పుడు ఈ అంశాలు జ్ఞప్తికి ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి