15, ఫిబ్రవరి 2010, సోమవారం

పరీక్షలకు ముందు చదవడమెలా?

పరీక్షలకు ముందు చదవడమెలా?
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి శాఖమూరి Sat, 13 Feb 2010, IST
మీ కోసం...!
పరీక్షల రూపంలో మిమ్మల్ని పరీక్షించే సమయం దగ్గరికొస్తోంది. తొమ్మిదో తరగతి వరకూ పట్టుదలతో ప్రణాళిక ప్రకారం చదవకున్నా హాజరు సాయంతో నెట్టుకొచ్చినవారు పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలనగానే ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక్కోరోజు తరిగిపోతూ, పరీక్షలు దగ్గరపడేకొద్దీ వీరి ఆందోళన మరింత ఎక్కువవుతుంది. ఆందోళన అధికమైతే తెలిసిన ప్రశ్నల జవాబులను కూడా మర్చిపోతామనేది వాస్తవం. 'చదివింది కొంత.. చదవాల్సింది కొండంత' అనే భావనను ముందు మన మనస్సులో నుంచి తీసేయాలి. ఇప్పటికే మీరు స్లిప్‌, యూనిట్‌ టెస్ట్‌, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ ద్వారా ముప్పావువంతు సిలబస్‌ను చదివేశారు. మిగిలిపోయిన కొద్దిపాటి పాఠ్యాంశాలనే చూసుకుని నిరాశ చెందడం వివేకవంతుల లక్షణం కాదు. ఇప్పటివరకు మీరు చదివిన సిలబస్‌ ఎంతో... ముందు గుర్తించండి. దానిని సంపూర్తిగా చదివాకనే మిగిలిన వాటిలో ప్రధానమనుకున్న వాటిని నేర్చుకోవాలి. రోజులో ఎన్ని గంటలు చదవాలో ముందుగా నిర్ధారించుకోవాలి. సబ్జెక్ట్స్‌ అన్నింటికీ ప్రతిరోజూ సమయాన్ని కేటాయించుకోవాలి. ఇక చదివే విధానాన్ని పరిశీలిస్తే అంశాన్ని చదవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అనుసంధానించుకోవడం అనేవి ప్రధానమైనవి. విషయాన్ని ఏకాగ్రతతో చదివాక.. కళ్ళు మూసుకుని అందులోని ముఖ్యమైన, కీలకమైన పదాలు (కీ వర్డ్స్‌) జ్ఞప్తికి తెచ్చుకుని.. వాటిని అంతకుముందే మనకు బాగా తెలిసిన పాఠ్యాంశాలతో జతపరచుకోవాలి. మనం ఏర్పరచుకున్న కీలకమైన పదాలను పట్టికలాగా రాసుకోవాలి.

అదే ప్రశ్నను పునశ్చరణ చేయాలనుకున్నప్పుడు కీలకపదాలను చూసి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. ప్రతిపాఠాన్ని ఈ కీలక పదాల రూపంలో నమోదు చేసుకుంటే పునశ్చరణ తేలికకావడమేగాక, ఎక్కువసార్లు పునశ్చరణ చేయొచ్చు. ఒక ప్రశ్నను కనీసం ఐదుసార్లైనా పునశ్చరించుకున్నప్పుడు అది శాశ్వత జ్ఞాపకశక్తిలోకి వెళ్లిపోతుంది. కొంతమంది వ్యాసరూప ప్రశ్నలు వదిలేసి.. ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలను సాధన చేస్తారు. అయితే ఇవి వ్యాసరూప సమాధానాల్లో అంతర్భాగాలే అని మనం గుర్తించాలి. ఒక పాఠ్యాంశం చదివాక అందులోని స్వల్ప సమాధాన ప్రశ్నలను విడిగా చదవాల్సిన పని ఉండదు. అందుకే పెద్ద ప్రశ్నలు చదివిన వెంటనే బిట్స్‌ను సాధన చేయండి.. ఎంత సులువుగా ఉంటాయో? కొన్ని అంశాలైతే ఎన్నిసార్లు చదివినా మర్చిపోతుంటాము. దీనికి కారణం యాంత్రికంగా చదవడమే! ఆ విషయాన్ని నిత్యజీవిత అంశాలతో మనమే కృత్రిమంగా జతపరచుకుంటే అది మన మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది.

అలాగే మనం వేకువజామున 3 గంటల నుండి 8 గంటల వరకూ ఉన్న సమయం చదువుపట్ల శ్రద్ధ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అయినా మన ప్రమేయం లేకుండా ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా ఉన్నామంటే ఆ సమయం కూడా శ్రద్ధగా చదవడానికి వీలుగా ఉన్నట్లే. సాయంత్రం 6 నుండి 8 గంటల సమయంలో కూడా మనం శ్రద్ధగా చదవొచ్చు.అలాగే ప్రయోగాల విషయానికొస్తే.. ప్రయోగాలు అతి స్వల్పంగా చేసి ఉంటాము. కొందరైతే అసలు చేసి ఉండరు. ప్రయోగ విధానాలు, పరికరాల పేర్లు గుర్తుంచుకోవాలంటే.. ఆ ప్రయోగాన్ని మనం చేసినట్లు ఊహించుకోవాలి. ఈ ఊహలో పరికరాల ఏర్పాటు నుంచి ఫలితం వచ్చేవరకూ క్రమపద్ధతిలో చేసినట్లు, ఫలితం లభించినట్లు ఉండాలి. పరీక్షల్లో ఈ క్రమపద్ధతినే ఉన్నది ఉన్నట్లుగా రాస్తే చాలు.
అన్ని పుస్తకాలూ ఒకేసారి ముందుంచుకుని చదవడం అశాస్త్రీయం. చదివే పుస్తకం తప్ప వేరేవేవీ మన దగ్గర ఉండొద్దు. ఒకరోజు నిర్దేశించుకున్న ప్రణాళిక పూర్తిచేయాలని గట్టి నిర్ణయం తీసుకుని ఏమాత్రం వాయిదా వేయకుండా చదివితే మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రశ్నల్లో చాయిస్‌ ఉంటుందన్న విషయాన్ని కూడా మరవకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి