2, మార్చి 2010, మంగళవారం

మార్కులు మీ ప్రతిభకు నిదర్శనం కాదు:

నియమబద్ధంగా పాఠశాలకు వెళ్ళి ’ఫస్ట్ ర్యాంకు’లు తెచ్చుకోకపోయినా ఎంతోమంది సుప్రసిద్ధులయ్యారు. తాము వెళ్ళిన మార్గంలో మరికొందరు నడిచేలా స్పూర్తినిచ్చారు. వారు మార్కులు సరిగా రాలేదని, ర్యాంకుల పట్టికలో తమ పేరు లేదని ఏనాడూ చింతించలేదు. ఏ విషయంపై తమకు ఆసక్తి ఉందో గమనించారు. ఆ రంగంలో ఉన్నతస్థానం పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకున్నారు. వాటిని పట్టుదలతో అమలుపరిచి చరిత్రపుటల్లో తమకంటూ కొంత స్థలాన్ని కేటాయించుకున్నారు. పరీక్షల్లో పలుమార్లు విఫలుడైన ఐనస్టీన్, చిన్నప్పుడే చదువు మానేసిన ఎడిసన్, కంప్యూటరే తనలోకమని నమ్మిన బిల్ గేట్స్, ప్రాథమికస్థాయిలోనే బడి ఒదిలి సంగీతపు ఒడి చేరిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ,... ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు జీవితంలో విజయం ఎలా సాధించవచ్చో సగర్వంగా చాటుతున్నారు.
ఇంతకీ ’మార్కులు’ మన ప్రతిభను వెల్లడిచేయవా? అని ప్రశ్నించుకుంటే.... అవి మన విషయజ్ఞానాన్నే తెలుపుతాయి. విషయజ్ఞానం తెలివితేటల్లో భాగమేకాని అదే సర్వస్వం కాదు. కానీ, నేడలా భావించడంలేదు. మార్కులు పొందితే చాలు... జ్ఞానవంతులు, తెలివిగలవారిగా మారిపోయినట్లేనని ప్రచారం సాగుతుండడం ఎంతో విచారకరం. ఇలాంటి అసంబద్ద నమ్మకాలవల్లనే ఎలాగైన నూటికి నూరు మార్కులు సంపదించాలన్న కాంక్ష మీలో పెరిగిపోతోంది. మీ తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టు ఒత్తిడి చేస్తున్నారు. వచ్చిన అత్యధిక మార్కుల్ని పక్కనబెట్టి రాని స్వల్పమార్కులకై మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
ఒకటి రెండు మార్కులు తగ్గినంత మాత్రాన ఏమాత్రం చింతించవద్దు. తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించండి.మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో వారికి తెలపండి. వీలున్నంతవరకు ఆ రంగంలో అభివృద్ది చెందేందుకు శిక్షణ ఇప్పించమనండి. మనం ఇష్టం పెంచుకుంటున్న రంగంలో మన ఆసక్తిని, ప్రతిభను కొలిచేందుకు అభిరుచి, వైఖరి పరీక్షలు (ఆప్టిట్యూడ్ , ఆటిట్యూడ్ టెస్ట్) ఉంటాయి. వాటిలో పాల్గొని మన అవగాహన ఎంత ఉందో అంచనా వేసుకోవచ్చు.
మార్కుల్ని మరిచిపొమ్మన్నాం కదా... అని పాఠ్యాంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. మనం కోరిన రంగంలో అభివృద్ధి సాధించాలంటే పాఠ్యాంశాల పరిజ్ఞానం ఎంతో అవసరం. గురువు బోధించే పాఠాలను పూర్తి ఏకాగ్రతతో వింటే నూటికి తొంబై శాతం మీకు గుర్తుంటుంది. చూడకుండా చెప్పడం, వ్రాయడం ద్వారా ఆ పాఠాలు మన మెదడులో శాశ్వతంగా గుర్తుంటాయి. ఇక ప్రశ్న ఎంత తికమకపెట్టేలా ఉన్నా సుళువుగా వ్రాసి ఎక్కువ మార్కులు పొందొచ్చు. మార్కులు తగ్గితే తరువాయి దఫా పరిక్షల్లో పెరిగేందుకు కృషి చేయాలేగాని.... కుంగిపోవడం,నిరాశ చెందడం విజ్ఞత కాదు. మీ ఆసక్తిని మీరు ప్రశ్నించుకోండి... అందులో కృషి చేయండి. పూర్తిగా మార్కుల్నే పట్టుకు వేలాడితే మార్కులే మిగులుతాయి. మనం సాధించే ప్రగతి ఏమీ ఉండదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి